Friday, October 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౭(647)

( భూభారంబు వాపుట ) 

11-3-మ.
"బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభారము
జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స
ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్‌.
11-4-వ.
అంత.
11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెం;
దన నిజభక్తులు యాదవ
ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.

భావము:
“శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=5

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: