Sunday, August 16, 2020

శ్రీ కృష్ణ విజయము - 9

( కేశిని సంహారము )

10.1-1169-క.
భీషణ ఘోటక దానవ
హేషానిర్ఘోషభిన్న హృదయ నిఖిల గో
యోషా పురుషార్భకమై
ఘోషము హరి చూడ దైన్యఘోషం బయ్యెన్.
10.1-1170-వ.
అ య్యవసరంబున.
10.1-1171-ఉ.
"పేదల ఘోషగోపకుల బిట్టదలించుట వీరధర్మమా?
కాదు; వ్రజంబులో దనుజఘస్మరుఁ డే" డని తన్ను రోయు క్ర
వ్యాదునిఁ జూచి గోపకుల కడ్డమువచ్చి "నిశాట! యింకఁ బో
రా" దని శౌరి చీరె మృగరాజు క్రియన్ నెదిరించె దైత్యుఁడున్.

భావము:
దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుడి సకిలింత వినబడేసరికి, అక్కడున్న ఆవులు, దూడలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలు అందరి హృదయాలు దద్ధరిల్లాయి. కృష్ణుడు చూస్తుండగానే ఆ గొల్లపల్లె అంతా దీనంగా ఘోషించసాగింది. అలా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ సమయంలో కేశి ఇలా అనసాగాడు. ఐత“బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం తరిమికొట్టడం నావంటి వీరుడికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడు ఏడీ, ఎక్కడ” అంటూ తనను తిడుతున్న ఆ అసురుణ్ణి కృష్ణుడు చూసాడు. గోపాలురకు అడ్డంగా వచ్చి శూరుని మనుమడైన కృష్ణుడు “ఓరీ నిశాచరా! ఇంక నువ్వు ఎక్కడకీ పోలేవు” అంటూ సింహంలాగ గర్జించి వాడిని పోరుకి పిలిచాడు. ఆ రక్కసుడు వాసుదేవుని ఎదిరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=133&padyam=1171

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: