Thursday, August 13, 2020

శ్రీ కృష్ణ విజయము - 4

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1157-వ.
అని తనవారి నందఱ నయ్యైపనులకు నియమించి యదుశ్రేష్ఠుం డగు నక్రూరునిం బిలిపించి చెట్టపట్టుకొని యిట్లనియె.
10.1-1158-శా.
"అక్రూరత్వముతోడ నీవు మనఁగా నక్రూరనామంబు ని
ర్వక్రత్వంబునఁ జెల్లె మైత్రి సలుపన్ వచ్చున్ నినుం జేరి నీ
వక్రోధుండవు మందలోన బలకృష్ణాభీరు లస్మద్వినా
శక్రీడారతులై చరింతురఁట యోజందెచ్చి యొప్పింపవే.
10.1-1159-ఆ.
నాకు వెఱచి సురలు నారాయణుని వేఁడి
కొనిన నతఁడు వచ్చి గోపకులము
నందు గృష్ణమూర్తి నానకదుందుభి
కుదితుఁ డయ్యె ననఁగ నొకటి వింటి.
10.1-1160-వ.
కావున నీవు గోపకులచేత నరులు గొని ధనుర్యాగంబు చూడరం డని వారలం దోడ్కొని రమ్ము, తెచ్చిన.

భావము:
ఆవిధంగా కంసుడు తన వాళ్ళందరికీ ఆ యా పనులు అప్పజెప్పి. యాదవోత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతితో పట్టుకుని, ఇలా అన్నాడు. “క్రూరకృత్యాలకు దిగకుండా బతుకు సాగించడం వలన నీకు అక్రూరుడనే పేరు సార్ధకనామం అయింది. నీతో కలసి మెలసి స్నేహం చేయవచ్చు. నీవు కోపంలేని వాడివి, నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో సిద్ధపడుతున్నారుట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. దేవతలు నాకు భయపడి వేడుకోడంతో, విష్ణువు యదువంశంలో వసుదేవుడికి కృష్ణుడుగా పుట్టాడని ఒక మాట విన్నాను. కాబట్టి, నువ్వు నందాదులైన యాదవులకు చెప్పి ఒప్పించి కప్పం గైకొని, ధనుర్యాగం చూడడానికి రండని వారిని పిలుచుకొని రావాలి. నువ్వు అలా తీసుకు వస్తే. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1159

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: