Friday, August 14, 2020

శ్రీ కృష్ణ విజయము - 6

( కంసుడక్రూరునితో మాట్లాడుట )

10.1-1163-సీ.
ఆ రామకేశవు లంతరించిన వసు$
  దేవ ముఖ్యులఁ జంపి తెగువ మెఱసి
వృష్ణి భోజ దశార్హ వీరులఁ దెగటార్చి$
  ముదుకఁడు రాజ్యకాముకుఁడు ఖలుఁడు
నగు నుగ్రసేను మా యయ్య గీటడగించి$
  పినతండ్రి దేవకుఁ బిలుకుమార్చి
మఱియు వైరులనెల్ల మర్దించి నే జరా$
  సంధ నరక బాణ శంబరాది
10.1-1163.1-ఆ.
సఖులతోడ భూమిచక్ర మేలెదఁ బొమ్ము
తెమ్ము వేగమ వసుదేవసుతుల
మఖము పేరు చెప్పి మంత్రభేదము చేయ
వలయుఁ బెంపఁ జనదు వైరి జనుల."
10.1-1164-వ.
అనిన నక్రూరుం డిట్లనియె.

భావము:
బలరాముడు కృష్ణుడు ఇద్దరు నేలకూలిన వెంటనే, వసుదేవుడు మున్నగు ప్రముఖులను సంహరిస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను హతమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడూ ముసలివాడూ దుర్మార్గుడూ అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పినతండ్రియైన దేవకుణ్ణి చంపేస్తాను. ఇంకా మిగిలిన శత్రువుల ప్రాణాలు తీస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో గూడి ఈ భూమండలాన్న పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో నీవు వెళ్ళి వసుదేవుడి కొడుకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకుని రా. పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయ రాదు.” కంసుడి మాటలు వినిన అక్రూరుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=132&padyam=1163

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: