Thursday, August 20, 2020

శ్రీ కృష్ణ విజయము - 12

( నారదుడు కృష్ణుని దర్శించుట )
10.1-1179-వ.
ఆ సమయంబునం బుష్పవర్షంబులు గురియించి సురలు వినుతించి; రంత హరిభక్తి విశారదుండైన నారదుండు వచ్చి గోవిందుని సందర్శించి రహస్యంబున నిట్లనియె.
10.1-1180-సీ.
“జగదీశ! యోగీశ! సర్వభూతాధార!$
  సకలసంపూర్ణ! యీశ్వర! మహాత్మ!
కాష్ఠగతజ్యోతి కైవడి నిఖిల భూ$
  తము లందు నొకఁడవై తనరు దీవు
సద్గూఢుఁడవు; గుహాశయుఁడవు సాక్షివి$
  నీ యంతవాఁడవై నీవు మాయఁ
గూడి కల్పింతువు గుణముల; వానిచేఁ$
  బుట్టించి రక్షించి పొలియఁజేయుఁ
10.1-1180.1-ఆ.
దీ ప్రపంచ మెల్ల నిట్టి నీ విప్పుడు
రాజమూర్తులైన రాక్షసులను
సంహరించి భూమిచక్రంబు రక్షింప
నవతరించినాఁడ వయ్య! కృష్ణ!

భావము:
ఆ సంతోష సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. స్తోత్రాలు చేసారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి, గోపాలకృష్ణుడిని దర్శించి ఏకాంతంగా ఇలా అన్నాడు. “కృష్ణా! జగదీశ్వరా! యోగీశ్వరా! సకల ప్రాణులకు ఆధారమైన వాడా! నిఖిలమునందూ నిండి ఉండువాడా! ఓ మహానుభావా! కట్టెలలో అగ్నిలా సమస్త ప్రాణులలోనూ ఏకరూపుడవై విలసిల్లుతూ ఉంటావు. హృదయ కుహర మందు గూఢంగా ఉంటావు. జీవులు ఆచరించే సకల క్రియాకలాపములకు కేవలం సాక్షీభూతుడవై ఉంటావు. సర్వస్వతంత్రుడవు. నీకు అధీనమై ఉండే మాయాశక్తిచే సత్వ్తరజస్తమో గుణాలను కల్పిస్తుంటావు. ఈ త్రిగుణాలచేత జగత్తును సృష్టి స్థితి లయాలు చేస్తుంటావు. రాజుల రూపాలలో ఉన్న రాక్షసులను నిర్మూలించి భూమండలాన్ని కాపాడడటం కోసం నీవు అవతరించావు స్వామీ.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=134&padyam=1180

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: