Wednesday, August 26, 2020

శ్రీ కృష్ణ విజయము - 14

( వ్యోమాసురుని సంహారించుట )

10.1-1183-వ.
అని వినుతించి వీడుకొని నారదుం డరిగె; నంత నొక్కనాడు కృష్ణ సహితులై గోపకుమారు లడవికిం జని పసుల మేపుచు నొక్క కొండదండ నిలాయనక్రీడ చేసి; రందు.
10.1-1184-క.
కొందఱు గొఱియల మంచునుఁ
గొందఱు పాలకుల మంచుఁ గుటిలత్వమునం
గొందఱు దొంగల మనుచునుఁ
జెంది కుమారకులు క్రీడఁజేసిరి తమలోన్.
10.1-1185-శా.
ఆలో దొంగలలో మయాసురసుతుం డాద్యుండు వ్యోముండు గో
పాలుండై చని మేషకల్పనలతో భాసిల్లి క్రీడించు త
ద్బాల వ్రాతము నెల్ల మెల్లనఁ జతుఃపంచావశిష్టంబుగా
శైలాంతర్గుహలోనికిం గొనిచనెం జౌర్యం బవార్యంబుగన్.

భావము:
అలా గోవిందుడిని స్తుతించి, సెలవు తీసుకుని నారదమహర్షి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట, ఒక రోజు గోపబాలురు కృష్ణుడితో కలిసి అడవికి వెళ్ళారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం దగ్గర దాగుడుమూతలు ఆడటం ప్రారంభించారు. ఆ దాగుడుమూతలాటలో కొందరు గొఱ్ఱెలుగా కొందరు కాపరులుగా కొందరు దొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము ఆడుకోసాగారు. అంతలో మయుడనే రాక్షసుడి పెద్ద కొడుకు వ్యోమాసురుడు గొల్లపిల్లాడి రూపం ధరించి, దొంగగా ఏర్పడిన వారిలో చేరాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొఱ్ఱెలుగా నటిస్తున్న గొల్లపిల్లలలో నలుగురు ఐదుగురిని తప్పించి మిగిలిన వారిని అందరినీ మెల్లగా ఒక పర్వతగుహలోకి తీసుకుపోయాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=135&padyam=1185

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: