Tuesday, January 29, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 102

10.1-617-వ.
అప్పుడు పండ్లు రాల్చిన చప్పుడు చెవులకు దెప్పరంబయిన, నదిరిపడి రిపుమర్దన కుతుకంబున గార్దభాసురుండు
10.1-618-మ.
పదవిక్షేపములన్ సవృక్షధరణీభాగంబు గంపింపఁగా
రదముల్ దీటుచుఁ గత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీ
తిదమై తూలఁగఁ గావరంబున సముద్దీపించి గోపాలకుల్
బెదరన్ రాముని ఱొమ్ముఁ దన్నె వెనుకై బీరంబు తోరంబుగన్.

భావము:
గార్దభ రూపంలో అక్కడ ఉండే రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో పడగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపేయాలనే కోరికతో బయలుదేరాడు. భయంకరంగా విజృంభించి వస్తున్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న నేలంతా చెట్లతో సహా అదరిపోయింది. అతడు చీలిన చెవులతో, తోక భయంకరంగా ఊగుతుండగా, పళ్ళు పట పట కొరుకుతూ, కొవ్వెక్కి పరిగెత్తుకు వచ్చాడు. ఆ గోపబాలకులు అందరూ బెదరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=618

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: