Thursday, September 19, 2019

తెలుగు భాగవతం (ద్వాదశ స్కంధం) - 1


( రాజుల ఉత్పత్తి )

12-4-వ.
అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుఁ బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రి యై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుండు దయించిన వానికిఁ బ్రద్యోతననామం బిడి పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డుదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు; తదనంతరంబ శిశునాగుం డను పార్థివుం డుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁ గాకవర్ణుండు, నా రాజన్యునకు క్షేమవర్ముఁ డుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుఁడును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకు లుద్భవించి షష్ట్యుత్తరత్రిశతి హాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్బంబున నతి బలశాలి యయిన మహాపద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁ గల దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁ గల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందులనొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీతలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుండనువానిం దన రాజ్యం బందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నా చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతుఁ డమ్మహనీయునకు శాలిశూకుం, డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, నవ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు, శుంగాన్వయుఁ డతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్నిమిత్రుండను నరపతి బుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వాని కి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీదఁట శుంగకుల సంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుండనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, నమ్మహానుభావునకు నారాయణుండునుఁ గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును.

భావము:
వీటిలో ముందుగా రాజుల గురించి చెప్తాను, రాజు బృహద్రథుడికి పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడు మంత్రిగా ఉంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దె నెక్కి, రాజ్యం పరిపాలిస్తాడు. అతనికి ప్రద్యోతుడు అని కొడుకు పుడతాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పజెప్తాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులు అయిదుగురు వృద్ధిచెందుతూ నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. అటుపిమ్మట శిశునాగుడు అనే రాజు పుడతాడు. అతనికి కాకవర్ణుడు, కాకవర్ణునికి క్షేమవర్ణుడు, క్షేమవర్ణమహారాజుకు క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్భకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్థనుడు, అతనికి మహానంది పుడతారు. ఈ పదిమంది రాజులు శైశునాగులు అన్న పేరుతో ప్రసిద్ధులై కలికాలంలో మూడువందలఅరవై ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తారు.
ఆ తరువాత, మహానందికి శూద్రస్త్రీ కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహా బలవంతుడు అవుతాడు. కానీ అతనితో క్షత్రియ వంశం అంతరించి పోతుంది. అప్పుడు రాజులు శూద్రప్రాయులు ధర్మహీనులు అయిపోతారు. పోతారు మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు ఎనమండుగురు పుడతారు. వారి పాలన వందసంవత్సరాలపాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు.
నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్థనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని పుత్రుడు శాలిశూకుడు, వాని నందనుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజులు అవుతారు. మౌర్యునితో కలసి ఆ పదిమందిరాజులు మొత్తంమీద నూటముప్ఫయేడు సంవత్సరములు నిరాటంకంగా రాజ్య పాలన చేస్తారు. అప్పుడు, బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశపు పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని గ్రహించి పరిపాలిస్తారు. పైన చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు ఏళ్ళు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభవుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=12&Ghatta=2&padyam=4

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం : :

No comments: