Tuesday, April 18, 2017

దక్షయాగము - 6:


4-42-సీ.
"పరికింప నితఁడు దిక్పాలయశోహాని;
కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి;
తం బయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీ సమానను సాధ్వి న;
స్మత్తనూజను మృగశాబనేత్ర
సకల భూమీసుర జన సమక్షమున మ;
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
4-42.1-తే.
జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.



భావము:
“ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=42

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: