Thursday, July 28, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౭(597)

( వృకాసురుండు మడియుట ) 

10.2-1240-ఆ.
కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన
యిష్టమైన వరము లిచ్చునట్టి
దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని
మునివరుండు పలికె ముదముతోడ.
10.2-1241-వ.
“వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నాక్షణంబ కోపప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వుర యందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁ దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమానసామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు నమ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి” నని చెప్పిన నతం డా క్షణంబ.

భావము:
తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. “అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారిమీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతులమీద అనుగ్రహము చూపాలన్నా, వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహా సామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక, నీవు కూడ శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది.” అని చెప్పాడు. వెంటనే....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1241

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: