Wednesday, July 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౩(583)

( శ్రుతి గీతలు ) 

10.2-1215-వ.
మఱియు వివిధకాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమభావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులయిన విచిత్రశరీరంబులయందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతంబైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మంబయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగతరజోగుణంబులందగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబులయిన శరీరంబులం బ్రవేశించియున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు మఱియును.

భావము:
దేవా! కఱ్ఱకు ఎన్ని వంకరలు ఉన్నా, కఱ్ఱలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా అలాగే. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్ఠంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ, ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములై ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులౌతారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1215

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: