Sunday, July 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౩(593)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1231-మ.
“మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా
రనయంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న
వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స
న్మునివర్యుల్‌ గడుఁ బేద లౌటకు గతంబున్ నా కెఱింగింపవే.”
10.2-1232-సీ.
నావుడు శుకయోగి నరనాథుఁ గనుఁగొని-
  విను మెఱింగింతుఁ దద్విధము దెలియ
"ఘనశక్తిసహితుండు కాలకంధరుఁడు దా-
  వినుతగుణత్రయాన్వితుఁడు గాన
రాగాదియుక్తమై రాజిల్లు సంపద-
  లాతనిఁ గొలుచు వారందు చుందు;
రచ్యుతుఁ, బరము, ననంతు, గుణాతీతుఁ,-
  బురుషోత్తముని, నాదిపురుషు, ననఘు,
10.2-1232.1-తే.
నర్థి భజియించువారు రాగాది రహితు
లగుచు దీపింతు రెంతయు ననఘచరిత!
ధర్మనందనుఁ డశ్వమేధంబు సేసి
పిదప సాత్త్విక కథనముల్‌ ప్రీతితోడ.

భావము:
“ఓ శుక మహర్షి! శివుడిని సేవించే దేవతలు, మానవులు సుఖసంపదలతో జీవిస్తారు; విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జీవిస్తారు; దీనికి కారణం ఏమిటో వివరించు.” అలా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా! శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు. సత్త్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు, పరమాత్మ, అనంతుడు, పురుషోత్తముడు, ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకధలు విన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1232

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: