Monday, July 18, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౪(594)

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 

10.2-1233-ఉ.
నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డారిన భక్తిమై నడిగి నట్ల యతండును మందహాస వి
స్ఫార కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.
10.2-1234-సీ.
"వసుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను-
  గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త
మంతయుఁ గ్రమమున నపహరించిన వాఁడు-
  ధనహీనుఁ డగుచు సంతాప మంద
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి-
  యై చేయునదిలేక యఖిలకార్య
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి-
  నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు
10.2-1234.1-తే.
బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ
నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు
వదలి భజియింతు రితరదేవతల నెపుడు.

భావము:
అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1234

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: