Sunday, July 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౮౭(587)

( శ్రుతి గీతలు ) 

10.2-1221-మ.
వనజాతాక్ష! భవత్పదాబ్జయుగ సేవాసక్తు లైనట్టి య
జ్జనముల్‌ మృత్యుశిరంబుఁదన్ని ఘనసంసారాంబుధిన్ దాఁటి పా
వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో
భనమై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంభద్వైభవోపేతులై.
10.2-1222-మ.
మిము సద్భక్తి భజింపనొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు నీ
చ మతివ్రాతము నేర్పునం బసులఁ బాశశ్రేణి బంధించు చం
దమునం బెక్కగు నామరూపములచేతన్ వారి బంధించి దు
ర్గమ సంసారపయోధిఁ ద్రోతువు దళత్కంజాతపత్త్రేక్షణా!

భావము:
ఓ దేవా! పరమ భాగవతులు సదా నీ పాదసేవలో నిమగ్నులు అయి ఉంటారు. వారు మృత్యువును జయించి; భవసాగారాన్ని తరించి; జననమరణ పరంపరలకు గురికాక; పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ; మహద్వైభవములతో ముక్తిని అందుకుంటారు. వికసించిన కలువరేకుల వంటి కన్నులు కల మహాత్మా! నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించేవారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి సంసారం అనే సముద్రంలో పడదోస్తావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1222

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: