Tuesday, July 30, 2019

కపిల దేవహూతి సంవాదం - 76


(భక్తి యోగం)

3-975-సీ.
పూని యసత్యంబులైన గృహక్షేత్ర; 
పశు ధన సుత వధూ బాంధవాది
వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి; 
వఱలు దుర్మతి యగువాఁడు జంతు
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి; 
యర్థి నయ్యై యోను లందుఁ జొరఁగ
ననుగమించును వాని యందు విరక్తుండు; 
కాక యుండును నరకస్థుఁ డైన
3-975.1-తే.
దేహి యాత్మీయదేహంబు దివిరి వదల 
లేక తన కది పరమసౌఖ్యాకరంబు
గాఁగ వర్తించు నదియును గాక యతఁడు
దేవమాయావిమోహితభావుఁ డగుచు.

భావము:

అశాశ్వతాలైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు మొదలైన వస్తువులే శాశ్వతం అని నమ్మి దుష్టబుద్ధియైన మానవుడు అనేకప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో జన్మిస్తూ ఉంటాడు. వానిపట్ల విరక్తి చెందడు. నరకం అనుభవించిన తర్వాతకూడా దేహి తన దేహాన్ని వదలక అదే ఎంతో సుఖప్రద మైనదిగా భావించి దానినే అంటిపెట్టుకొని ఉంటాడు. అంతేకాక అతడు దేవుని మాయకు లొంగినవాడౌతాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=975

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: