Saturday, October 6, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 28

10.1-482-ఆ.
అమరవరులకొఱకుఁ గమలజాండం బెల్ల
బలిఁ దిరస్కరించి బలియు వడుగు
గోపసుతులకొఱకుఁ బాపపుఁ బెనుబాము
గళము దూఁటుగట్ట బలియకున్నె?
10.1-483-ఉ.
ఆ పెనుబాము మేన నొక యద్భుతమైన వెలుంగు దిక్తటో
ద్దీపకమై వడిన్ వెడలి దేవపథంబునఁ దేజరిల్లుచున్
క్రేపులు బాలురున్ బెదరఁ గృష్ణుని దేహము వచ్చి చొచ్చె నా
పాపఁడు చొచ్చి ప్రాణములఁ బాపిన యంతన శుద్ధసత్వమై.

భావము:
వామనమూర్తిగా దేవతల కోసం బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండం అంతా ఆక్రమించిన ఈ కృష్ణమూర్తి; అమాయకులైన గోపబాలకుల కోసం పాపిష్టి పాము గొంతుక బ్రద్దలై పగిలిపోయేలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? అలా కృష్ణుడు సహచరులతో బయటకు వచ్చిన ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. అంతటి పాపిష్టి పాము తన దేహంలోకి కృష్ణుడు ప్రవేశించి ప్రాణాలు తీయగానే శుద్ధతత్త్వమయం అయిపోయింది. దిక్కులు వెలిగిపోయే టంత అద్భుతమైన వెలుగువలె వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించింది. అది చూసిన గోపబాలురు లేగలతో పాటు బెదరిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=66&padyam=483

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: