Sunday, January 8, 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౩(713)

( అవధూత సంభాషణ ) 

11-107-వ.
అనినం గృష్ణుండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు నాలుగాశ్రమంబుల కిట్టిట్టి వర్హంబు లనియును, నాలుగు వేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తి నివృత్తి హేతువు లగు పురాణేతిహాస శాస్త్రంబులును, వైరాగ్యవిజ్ఞానంబులును నివి మొదలుగాఁ గలవన్నియు నెఱిగించి, “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున నెవ్వఁడేని నా యందు మతి గలిగి వర్తించు వాఁడు నేనని పలుకంబడుఁ; బెక్కు విధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక నామీఁదఁ దలంపు గలిగి వర్తింపు” మనిన నుద్ధవుం డిట్లనియె.

భావము:
ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు ఇతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=107

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments: