Friday, February 1, 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 104

10.1-621-మ.
ఒక తాలాగ్రముఁ దాఁక వైవ నది కంపోద్రిక్తమై త్రుళ్ళి వే
ఱొక తాలాగ్రము పైఁబడ న్నదియు నయ్యుగ్రాహతిన్ నిల్వ కొం
డొక తాలాగ్రము పైఁ బడన్ విఱిగి యిట్లొండొంటిపైఁ దాలవృ
క్షకముల్ గూలెఁ బ్రచండ మారుతము దాఁకంగూలు చందంబునన్.
10.1-622-ఉ.
తంతువులందుఁ జేలము విధంబున నే పరమేశు మూర్తి యం
దింతయుఁ బుట్టునట్టి జగదీశుఁ డనంతుఁడు దైత్యమాతృ ని
ట్లంతము జేయు టెంతపని? యద్భుత మే విను మంతలోన వాఁ
డంతముఁ బొందు టెల్లఁ గని యాతని బంధులు గార్దభంబులై.

భావము:
అలా చచ్చిన రాకాశి గాడిదను బలరాముడు ఒక తాటిచెట్టుకేసి విసిరి కొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరొక తాటిచెట్టు పై పడింది. ఆ వేగానికి ఆ చెట్టు మరొక చెట్టు పై పడింది ఇలా ఎన్నో చెట్లు సుడిగాలి దెబ్బకు పడిపోయినట్లు, నేలపై కూలిపడిపోయాయి. దారపు పోగులు మూలపదార్ధమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం చేయ చేయబడుతుంది. అలా దారాల యందు వస్త్రం కలదు. అదే విధంగా పరమేశ్వరుని రూపము ఈ జగత్తుకి మూలపదార్ధము కాగా ఈ సృష్టి అంతా అతని యందే కలదు. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసుడిని చంపగలగడంలో ఆశ్చర్యం ఏముంది. ఆ రాక్షసుడు చనిపోవడం చూసి, అతడి బంధువులు అంతా గాడిద రూపాలలో కృష్ణుడి పైకి, బలరాముడి పైకి వచ్చిపడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=622

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: