Sunday, November 26, 2017

పోతన రామాయణం - 46

9-346-సీ.
వసుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు; 
కొఱకునై రాముండు గూఢవృత్తి
నడురేయి దిరుగుచో నాగరజనులలో; 
నొక్కఁడు దన సతి యొప్పకున్న
నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ; 
బాయంగలేక చేపట్ట నేమి
తా వెఱ్ఱి యగు రామధరణీశ్వరుండనే; 
బేల! పొమ్మను మాట బిట్టు పలుక
9-346.1-ఆ.
నాలకించి మఱియు నా మాట చారుల
వలన జగములోనఁ గలుగఁ దెలిసి
సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి
పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి.

భావము:
రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్థరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి, “పరాయి ఇంటిలో కొన్నాళ్ళు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెఱ్ఱిరాముడను అనుకున్నావా? పోపో.” అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక, చారుల ద్వారా ఈ విషయం లోకంలో వ్యాపించి ఉందని తెలిసికొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండ రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=23&padyam=346

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: