Thursday, April 6, 2017

మత్స్వావతార కథ - 24:


8-734-వ.
అంతం బ్రళయావసాన సమయంబున.
8-735-సీ.
ఎప్పుడు వేగు నం చెదురు చూచుచునుండు;
మునుల డెందంబులం ముదము నొందఁ,
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి;
యోరపయ్యెదఁ జక్క నొత్తి కొనఁగ,
మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబుఁ;
దొంటి చందంబునఁ దొంగలింపఁ,
బ్రాణుల సంచితభాగధేయంబులుఁ;
గన్నుల కొలకులఁ గానఁబడఁగ,
8-735.1-తే.
నవయవంబులుఁ గదలించి, యావులించి
నిదురఁ దెప్పఱి, మేల్కాంచి, నీల్గి, మలఁగి,
యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు.
ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు.

భావము:
అలా హయగ్రీవాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్దరించే సమయానికి ప్రళయకాలం ముగిసింది. అలా ప్రళయకాలం ముగిస్తుండటంతో, ఎప్పుడు తెలవారుతుందో అనుకుంటూ ఎదురుచూస్తున్న మునుల హృదయాలు సంతోషించాయి. మైమరచి నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చుండి ఓరగా పైట సర్దుకుంది. ప్రళయకాలం మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరల మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలోవున్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించాడు. ఆవులించి మేల్కొని నిక్కి. ఒడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడానికి కూర్చున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=735

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: