Wednesday, April 24, 2013

పర్యావరణ రక్షణ – బాగవతపురాణం



పర్యావరణాన్ని రక్షించ మని పురాణలు కూడ ఘోషిస్తున్నాయి. మన పోతనగారు ఆంధ్రమహాభాగవతంలో చతుర్థ స్కంధంలో ప్రచేతసుల వృత్తాంతంలో వృక్షాలను నాశనం చేయవద్దని బ్రహ్మదేవు డంతటి వాడిచేత చెప్పించి పర్యావరణ ఆవశ్యకతను ఒత్తి చెప్పాడు. (పద్యాలు 4-684 నుండి 4-943). చూడండి ఈ ప్రచేతసుల కథ
ప్రాచీన బర్హి (అంతట తూర్పుకి చివరలు ఉండేలా పరచిన దర్భలు కలవాడు, తన రాజ్యంలో సర్వే సర్వత్రా యఙ్ఞాలు చేయించేవాడు) మహారాజుకి భార్య సముద్ర పుత్రి శతధ్రుతిట. వారికి ప్రచేతసులు అని పదిమంది కొడుకులుట (చేతస్సు అంటే మది / ప్రాణము, ప్ర అంటే మిక్కిలి). వారికి విడి విడిగా పేర్లులేవుట. వారు అందరు అంతా కలిసి కట్టుగా ఉంటారుట (అంటే సృష్టిలోని ఙ్ఞానులు సర్వులనా?). వారిని తండ్రి (కారణ భూతుడు) వంశాభివృద్ధికై తపస్సు చేయమని ఆఙ్ఞాపించాడు. వారు సముద్రంలో తపస్సు చేస్తున్నారు (జీవులు సముద్రంలోనే మొదట పుట్టాయిట!). భగవంతు (ప్రభువు) డగు హరి ఆఙ్ఞమేర తపస్సు ఆపి బైటకొచ్చారు. భూమిపై చెట్లు విపరీతంగా పెరిగిపోయాయని కోపం తెచ్చుకొని చెట్లని తమ తపోగ్నితో కాల్చివేస్తున్నారు. వృక్షాలు అడ్డంగా ఉన్నాయని ఆగ్రహించారుట. బ్రహ్మదేవుడు (సృష్టి కర్త) వారిని అనునయించి ఆ ప్రళయాన్ని ఆపాడు, బ్రహ్మ ఆఙ్ఞ ప్రకారం వృక్షాలు తమ పెంపుడు కూతురు మారిషను (మారిషను తెలుగులో తోటకూర అంటారు.) ఇచ్చాయి. ఆమెను వారందరు కలిసి పెళ్ళాడారు.
ఈ కథ నీతి: - చెట్లని నాశనం చేయకండి. వాతావరణం నాశనమైపోయి అకాల ప్రళయం వచ్చేస్తుంది.  
మరి అందుచేత మన వాతావరణాన్ని మనమే కాపాడుకుందామే.
ఇంత చక్కటి వృత్తాంతాన్ని బమ్మెర వారు ఎంత చక్కటి పద్యాలు వాడారో చూడా లనిపిస్తోందా. ఐతే కింద కొన్ని పద్యాలు ఉన్నాయి ఆనందించండి.
4-938-వ.  
తదనంతరంబ ప్రచేతసులు భగవదాఙ్ఞ శిరంబులధరియించి సముద్రసలిల నిర్గతు లయి, 
4-939-క. 
 భూరి సమున్నతి నాక
ద్వార నిరోధంబు గాఁగఁ దగఁ బెరిఁగిన యా
భూరుహ సంఛన్నాఖిల
ధారుణి నీక్షించి రాజతనయులు వరసన్.
4-940-చ.  
ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో
చనుగతి నుగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా
ననయముఁజేయఁబూనిన జనాధిపసూనులమోములందుఁ దా
మనల సమీరముల్ జననమంది కుజంబులఁ గాల్పఁజొచ్చినన్.
4-941-క.    
నలినభవుఁ డా మహీజ
ప్రళయముఁ గని వచ్చి ధరణిపాల తనూజా
తుల మధురోక్తుల నుపశాం
తులఁ గావించుచును నయము దూఁకొనఁ బలికెన్.
4-942-వ.   
అట్లు పలికి వారల నుపశమిత క్రోధులం జేసిన యనంతరంబ,

Saturday, April 13, 2013

భాగవతము – నవీన భౌతిక శాస్త్రం


        భాగవత పురాణం బాగా వికసించిన నాగరికత / సంస్కృతి అతి పురాతన కాలంలో ఉండేదని సూచిస్తోంది. పురాతన కాలపు కొలమానాదులు అంతరిక్ష / జ్యోతిర్మండల కొలతలకి సరిపోలుట సాధ్యం కాదు. అలా సరిపోతున్నాయి అంటే అతి నిర్ధుష్టమైన శాస్త్రీయ అవగాహన ఆ కాలాలలో కూడా ఉండితీరాలి. యోజనం అనే కొలమాన వివరం దీనికి చక్కని ఉదాహరణ. ఈ విషయాన్ని శ్రీ శతపుట దాస గారు శ్రీమద్భాగవతంలోని - నిర్దుష్టమైన శాస్త్రీయత అనే కృష్ణడాట్ కం జాలిక పుటలో ఎంతో చక్కగా రూఢి చేసారు. 
దానిని ఆధారంగా మన తెలుగుభాగవతంలో (అలమారలో) భాగవతం - సామాన్య శాస్త్రం అని మన తెలుగులో చిన్న వివరణ ఇచ్చాను. సహృదయులు చూడండి, తమ అభిప్రాయాలు ఇక్కడ చెప్పండి

Wednesday, April 3, 2013

పంచోపనిషణ్మయ దివ్యదేహము





పంచోపనిషత్తులు – 1ఈశ 2కేన 3కఠ 4ప్రశ్న 5మండూక ఉపనిషత్తులను పంచోపనిషత్తులు అంటారు.
ఉపనిషత్తులు ఆత్మ విచారణ సాధనములు. ఉపనిషత్తులు వేదాంత సారాన్ని, పరావిద్యని, పరమాత్మ తత్వాన్ని వివరిస్తాయి. వానిలో ముఖ్యమైనవి పంచోపనిషత్తులు. 
ఈ పంచోపనిషత్తులలో ప్రతిపాదితమైన ఆ పరమాత్మ లక్షణ మయమై ప్రకాశించే దేహమే ఆ భగవంతుని పంచోపనిషణ్మయ దివ్యదేహము అని భావిస్తున్నాను.
ఈ పంచోపనిషత్తుల మూలాలు -
1.      ఈశోపనిషద్
శుక్లయజుర్వేదీయ మధ్యాన్దనీశాఖానుసారిణీ కాణ్డవశాఖా కే చతుర్థ దషక్ కె దశమ అద్యాయ్ కె ప్రథమ అనువాక్ కో ఈశోపనిషద్ కహతె హై. (శుక్లయజుర్వేదంలోని మధ్యాందనీశాఖ అనుసరించిన కాండవ శాఖ యొక్క చతుర్థ దషకం యొక్క దశమ అద్యాయంలోని ప్రథమ అనువాక్కుని ఈశోపనిషత్తు అంటారు)
2.      కేనోపనిషద్
సామవేద్ కీ తలవకారశాఖా కె నవమ అధ్యాయ్ కో కేనోపనిషద్ కహతె హై. (సామవేదం లోని తలవకారశాఖ యొక్క నవమ అధ్యాయాన్ని కేనోపనిషత్తు అంటారు.)
3.      కఠోపనిషద్
కృష్ణయజుర్వేద్ కీ కఠశాఖా కీ యహ్ కఠోపనిషద్ హై. (కృష్ణయజుర్వేదంలోని కఠశాఖయే కఠోపనిషత్తు.)
4.      ప్రశ్నోపనిషద్
అధర్వవేద్ కీ పిప్పలాదశాఖా కా ప్రశ్నోపనిషద్ హై. (అధర్వణ వేదంలోని పిప్పలాద శాఖయే ప్రశ్నోపనిషత్తు.)
5.      మండూకోపనిద్
అధర్వవేద్ కీ శౌనకీశాఖా కా యహ్ ముండకోపనిషద్ హై. (అధర్వణవేదం లోని శౌనకీ శాఖయే ముండకోపనిషత్తు.)
మూలాలు – శ్రీమహాలక్ష్మీనారాయణయఙ్ఞసమితి, ఓభాపట్టీ సమారియా, భోజపుర్ జిల్లా, ద్వారా ప్రచురింపబడిన ఈశాదిపంచోపనిషదః నుండి గ్రహించడ మైనది.